Mon Jun 09 2025 09:51:33 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఇదెక్కడి పంచాయతీరా నాయనా? పార్టీ వాళ్లే విలన్లుగా మారుతున్నారెందుకో?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలోనే టీడీపీకి చెందిన అనేక మంది కార్యకర్తలు, నేతలు హత్యకు గురయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ ఏడాదిలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు, నేతలు హత్యకు గురయ్యారు. అయితే అనేకచోట్ల టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ హత్యలకు కారణమని గుర్తించారు. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి హత్య కేసును పరిశీలించినా, తర్వాత జరిగిన పల్నాడు జంట హత్య కేసులను చూసినా.. తర్వాత తాజాగా అనంతపురంలో టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర కోణం పరిశీలించినా వీటి వెనక ఒకే పార్టీకి చెందిన నేతలుండటం విశేషం. ఆధిపత్య పోరు, అనేక విషయాల్లో భాగస్వామ్యం మధ్య తలెత్తిన విభేదాలు వంటివి ఈ ఘటనలకు కారణాలుగా చెబుతున్నారు.
అనేక హత్యల విషయంలోనూ...
వీరయ్య చౌదరి హత్యను పరిశీలిస్తే మద్యం, ఇసుకతో పాటు అనేక కాంట్రాక్టు పనులకు తమకు అడ్డుతగులుతున్నారని సొంత సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలే హత్యచేయించారు. పల్నాడు జంట హత్యలు చేసింది కూడా టీడీపీ నేతలే. అయితే దీని వెనక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ జంట హత్యలకు పాల్పడింది మాత్రం టీడీపీకి చెందిన వారే కావడం విశేషం. ఇక తాజాగా అనంతపురంలో సుధాకర్ నాయుడును హత్య చేయడానికి భారీ స్కెచ్ వేశారు. దీని వెనక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపించడంతో అధినాయకత్వం కూడా సీరియస్ అయింది.
అనేక విషయాల్లో విభేదాలు...
గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు అధినాయకత్వం టిక్కెట్ ఇచ్చింది. కూటమికి గత ఎన్నికలలో ఫుల్లు హవా రావడంతో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు కోసం సుధాకర్ నాయుడు తీవ్రంగా శ్రమించారు. సుధాకర్ నాయుడుకు కూడా దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల సమయంలో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఇద్దరూ టీడీపీ నేతలే కావడంతో పెద్దలకు ఈ సమాచారాన్ని పోలీసులు అందించారు. సుధాకర్ నాయుడును ఎస్పీ జగదీశ్ పిలిచి విచారించారు.
నాయుడు హత్యకు కుట్ర?
సుధాకర్ నాయుడును హత్య చేసేందుకు ఎమ్మల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరులు ప్లాన్ చేశారని పోలీసులు రహస్యంగా విచారణ జరిపి నివేదిక పంపారు. దీంతో ఇద్దరు టీడీపీ నేతలు కావడంతో పాటు ఇద్దరి నేతల అవసరం పార్టీకి ఉండటంతో టీడీపీ నాయకత్వం అమరావతికి రావాలని పిలిచినట్లు తెలిసింది. ఇద్దరిలో ఎవరిది తప్పు అన్నది తేల్చి క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాణాలు తీసుకునేంత స్థాయిలో విభేదాలు ఎందుకు వస్తున్నాయన్న దానిపై ప్రస్తుతం టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇసుక, మద్యం వ్యాపారాలతో పాటు మరికొన్ని కాంట్రాక్టు పనుల విషయంలోనే వివాదాలు పెరిగి అవి కక్ష పెంచుకునేందుకు దారి తీస్తున్నాయని భావించిన అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఉన్న చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకుని నేతల మధ్య విభేదాలను తొలగించే బాధ్యతను ఇన్ చార్జి మంత్రులకు అప్పగించే అవకాశముంది.
Next Story