Mon Jun 09 2025 04:52:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏడాది చంద్రబాబు సర్కార్ కు మార్కులెన్ని? ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఏడాది మాత్రమే కావడంతో ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. అదే సమయంలో జగన్ ఐదేళ్ల పాలనతో బేరీజు వేసుకుని చూస్తే ఇటు పరవాలేదని చెప్పలేని పరిస్థితి. అటు బాగా లేదని అనలేని స్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరి మనసులో అభివృద్ధి జరగాలని ఆశిస్తారు. అదే సమయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉండాలని భావిస్తారు. అయితే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అంచనాలు, ఆలోచనలు అందుకోలేకపోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
కొంత పరవాలేదని...
రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. పరిశ్రమలు రావాలని అనుకుంటారు. పది మందికి ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిస్తారు. నిరుద్యోగ సమస్య లేకుండా తక్కువ ధరలకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకుంటారు. ఈ విషయాల్లో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడతాయి. ఎందుకంటే వచ్చిన వెంటనే రహదారులను మరమ్మతులు చేశారు. పరిశ్రమలు కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు మెరుగయితాయన్న భావన ప్రజల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండటంతో నిధులు సమకూరడంతో పాటు పరిశ్రమలు కూడా త్వరగానే వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
సంక్షేమం విషయంలోనే...
ఏడాదిలో మొదటి మూడు నెలలు తొలగించాల్సిందే. అయితే మిగిలిన తొమ్మిది నెలల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటే పరవాలేదని పించేలా ఉందని ప్రజలు అంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలపై మాతరం పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచడం ఒకే. అదే సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అందచేస్తున్నారు. అంతకు మించి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సంబంధించిన పథకాలను గ్రౌండ్ చేయలేకపోవడంతో ఒకింత ఆ వర్గం ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. జగన్ హయాంలో తమ బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉండేవని, కానీ కూటమి సర్కార్ ఏర్పాటయిన ఏడాదిలో అకౌంట్ లోకి పైసా పడకపోవడంపై ఒకింత అసంతృప్తి కనిపిస్తుంది.
క్యాలెండర్ ప్రకటిస్తామని...
కానీ చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, వరసగా అన్ని పథకాలను అమలు చేస్తామని, ఇచ్చిన హామీలతో క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం ఒకింత ఊరటనిచ్చే అంశమే. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అందచేయనున్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేస్తామని చెప్పడం ఒకింత ప్రజల్లో అసహనంకలుగుతుంది. రెండు నుంచి మూడు వేలు వస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తుండటంతో రానున్న కాలంలో ఈ ఒపీనియన్ లో మార్పు వచ్చే అవకాశముందన్న భావనలో టీడీపీ నేతలున్నారు.
Next Story