Sun Jun 08 2025 19:59:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. వారేనా ఆ ముగ్గురు?
రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది

రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముంది. దాదాపు రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లయింది. మంత్రివర్గంలో ముగ్గురు లేదా నలుగురి చోటు ఉండే అవకాశముంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు లేదానలుగురికి చోటు ఉండే అవకాశముందని తెలిసింది. అయితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పలు దఫాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ లతో సంప్రదింపులు జరిపిన అధినాయకత్వం ముగ్గురు లేదా? ఎవరన్నది సీల్డ్ కవర్ లో తెలియజేసే చాన్స్ ఉంది. దీంతో సామాజికవర్గాల సమీకరణ ఎలా ఉండాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తో చర్చించారు.
తొలి నుంచి సమస్యగా..
తెలంగాణ కేబినెట్ విస్తరణ అధినాయకత్వానికి తొలి నుంచి పెద్ద సమస్యగా మారింది. విస్తరణ చేపడితే సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ఆశావహులు మంత్రి పదవి కోసం ఆశలు పెంచుకున్నారు. రెండేళ్ల నుంచి ఆరు మంత్రి పదవులను భర్తీ చేయకపోవడానికి కారణాలు ఇవే. ఎప్పుడు విస్తరణ చేపట్టినా కందిరీగల తుట్టె కదిలించినట్లేనన్న భావన హైకమాండ్ లో ఏర్పడిందని అర్థమవుతుంది. కాంగ్రెస్ అంటే అంతే. ప్రతి వారూ తాము మంత్రిపదవికి అర్హులమని భావిస్తారు. ప్రాంతీయ పార్టీల్లో మాదిరి కాదు. అక్కడయితే అధినేత నిర్ణయమే శిరోధార్యం. కానీ ఇక్కడ అలా కాదు. తాము కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమని గట్టిగా నమ్ముతారు.
ఆశావహులు ఎక్కువ మంది...
అందుకే హైదరాబాద్ కు వచ్చిన మీనాక్షి నటరాజన్ ను వరస పెట్టి నేతలు కలసి తమకు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉన్న పదవులు ఆరు. పోటీ పడే వారి సంఖ్య పదుల్లోనే ఉంది. పైగా సామాజికవర్గం కోటా, ప్రాంతీయ కోటా అంటూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇక హైకమాండ్ లో లాబీయింగ్ చేసే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏదో ఒక రూట్లో ఢిల్లీకి వెళ్లి అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారు కూడా ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని కోరతున్నారు. తాము కాంగ్రెస్ లో చేరే సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
నమ్మకం, విధేయతలకు...
ఇక ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో నమ్మకంగా ఉంటున్న వారు తమకు అవకాశం కల్పించాలని, పార్టీ విధేయతకు పట్టం కట్టాలని కోరుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్ లు పార్టీలు మారి వచ్చి తమకు మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి వంటి నేతలు విధేయతను చూడాలంటున్నారు. మరొకవైపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదని, తమకు అవకాశం కల్పించాలని మరికొందరు షరతులు విధిస్తున్నారు. ఇక మాదిగ సామాజికవర్గానికి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆ సామాజికవర్గం నేతలు పట్టుబడుతున్నారు. అయితే రెండేళ్ల నుంచి మంత్రివర్గ విస్తరణ జరపకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమయి హైకమాండ్ విస్తరణకు ఓకే చెప్పింది. ఈ దఫా విస్తరణలో బీసీలకు, ఎస్సీలకు అవకాశం కల్పించే అవకాశాలున్నాయి. గడ్డం వినోద్ తో పాటు బీసీ కోటాలో వాకిటి శ్రీహరితో పాటు ఆది శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తుంది. ఎస్టీ కోటాలో బాలూ నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
Next Story