Sat Jun 07 2025 23:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : ముద్రగడ హెల్త్ నిజంగా బాగాలేదా? ఇది మరో అన్నా చెల్లెళ్ల ఘర్షణేనా?
ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ అన్నా చెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది

ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ అన్నా చెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది. ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనూ మరో వైఎస్ షర్మిల.. మరో కల్వకుంట్ల కవిత లా ఆయన కుమార్తె క్రాంతి తయారయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయనకు సరైన వైద్యం అందించకుండా తన సోదరుడు ముద్రగడ గిరి బంధించారని క్రాంతి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తండ్రి ముద్రగడను ఎవరూ కలవకుండా సోదరుడు గిరి నిర్భంధించారని, చికిత్స కు కూడా ఆటంకం కలిగిస్తున్నారని క్రాంతి చేసిన ఆరోపణలు కేవలం కిర్లంపూడికే పరిమితం కాలేదు. ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆస్తుల కోసమేనా?
ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి స్థాయి నేత కాదు. కేవలం మాజీ మంత్రి. కాపులకు ప్రతినిధిగా మొన్నటి వరకూ ఉండేవారు. అయితే ఆయనకు క్యాన్సర్ ఉందని, కుమారుడు గిరి ఆయనకు చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నారని క్రాంతి అనడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది కూడా ఆస్తులకు సంబంధించిన వివాదంగానే చూడాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కి ఏ పార్టీ లేదు కనుక.. రాజకీయ వారసత్వం కోసం మాత్రం అయితే ఇంత పెద్ద స్థాయిలో విభేదాలు రావు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు ముందు క్రాంతి జనసేన పార్టీలో చేరిపోయారు. నాడు తన తండ్రి ముద్రగడ పద్మనాభంపైనే క్రాంతి విమర్శలు చేశారు.
కాపు సామాజికవర్గంలో...
అలాంటి క్రాంతి ఇలా క్యాన్సర్ ఉందని ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా కాపు సామాజికవర్గంలో కలకలం బయలుదేరింది. ఎంత వైసీపీలో ఉన్నప్పటికీ ముద్రగడ పట్ల కాపు సామాజికవర్గానికి ప్రత్యేక అభిమానం ఉంది. వారు ఓట్లు వేయకపోవచ్చు కానీ, ముద్రగడపద్మనాభం నిలకడలేని తనాన్నిప్రశ్నించవచ్చు కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిజాయితీని శంకించరు. ఆయన తన మాట నెగ్గకుంటే పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఘటనలు గతంలో అనేక సార్లు చూశాం. అదే సమయంలో ఇటీవల ఆయన వరసగా వైఎస్ జగన్ తో జరిగిన సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. నిజంగా ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ ఉంటే రాజకీయంగా యాక్టివ్ గా ఉండే వారు కారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
క్యాన్సర్ తో పోరాడుతుంటే...
కానీ కేవలం ముద్రగడ పద్మనాభం వెన్నుపోటు దినంలో పాల్గొనకపోవడం వల్లనే క్రాంతి ఈ ఆరోపణలు చేశారా? లేదా నిజంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారా? అన్నది మాత్రం తెలియరాలేదు. అదీ ముద్రగడ పద్మనాభం బయటకు చెబితేనే నిజం తెలుస్తుంది. నిజంగా క్యాన్సర్ తో పోరాడుతుంటే ఆయన ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నప్పుడు కూడా ఇది బయటపడేది అని ఆయనను అభిమానించే వారు అంటున్నారు. అదే సమయంలో ఇది కూడా అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం లాగే కనిస్తుందని, కేవలం ముద్రగడ కుటుంబ సమస్యను కుమార్తె రోడ్డు మీదకు లాగుతున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ముద్రగడకు క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఆయన అభిమానులు, సన్నిహితులు చేసే ప్రయత్నం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ తో ముద్రగడ బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సన్నిహితులకు కూడా ఆయన దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Next Story